- ప్రభుత్వం ఇస్తేనే గుర్తింపా
- ప్రజల హృదయాలే అవార్డు
ఎట్టకేలకు కింగ్ నాగార్జున నంది అవార్డులపై స్పందించాడు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న ఆయనను హలో సినిమా కోసం మీడియా ముందుకు వచ్చిన అతడు నంది అవార్డులపై నోరు విప్పాడు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు చేశాడు. నిర్మాత బండ్ల గణేశ్, నల్లమలుపు బుజ్జి, గుణశేఖర్ ఇలా ఎంతోమంది విమర్శలు చేశారు. మనం సినిమా గురించి అభిమానులు ప్రశ్నిస్తున్నా అక్కినేని కుటుంబం నోరు విప్పలేదు. ఇప్పుడు మాట్లాడారు.
”మనం” సినిమాకు నంది అవార్డు రాకపోవడం ఆశ్చర్యంగా అందరూ భావిస్తున్నారు. తనయుడు అఖిల్ నటించిన హలో సినిమా విశేషాలను తెలిపేందుకు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ”మనం అనేది మాకు ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే అది నాన్నగారి ఆఖరి సినిమా. సినిమాను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. వారి హృదయాలను మాకు అవార్డుగా ఇచ్చారు. అంతకంటే ఏం కావాలి? మాకు అదే ఆస్కార్ కంటే ఎక్కువ. వేరే అవార్డులు మాకు అక్కర్లేదులే” అంటూ తెలిపారు. ఎక్కడా విమర్శల జోలికి పోకుండా, కనీసం ఆ ప్రభుత్వం ప్రకటించిన అవార్డు పేరు ఎత్తకుండా తనదైన శైలిలో బదులిచ్చాడు.
ప్రస్తుతం నాగార్జున అఖిల్ సినిమా హలో కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆ సినిమాను డిసెంబర్ 22వ తేదీన విడుదలకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా నాగ్ రామ్గోపాల్ వర్మ శివ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు.