తెలుగు సినీ పెద్దలు ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళులర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ పెద్దలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదన్నారు. పత్రికలు, మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. ఇక లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమలో కష్టాలు ఎదురువుతున్నాయని.. షూటింగ్ లను త్వరగా ప్రారంభమైతే మంచిదన్నారు. తక్కువ మంది సిబ్బందితో, భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్లు జరుపుకోవాల్సి ఉంటుందన్నారు.
కాగా, లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు పలువురు సినిమా రంగ ప్రముఖులు మే 22న కేసీఆర్తో సమావేశమైన అయ్యారు. సినిమా షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశలవారీగా పునరుద్ధరిస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.