ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ నటించిన They Call Him OG సినిమాకు భారీ టికెట్ ధరల పెంపును ఆమోదించడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. బెనిఫిట్ షో టికెట్లను రూ.1,000కు విక్రయించేందుకు అనుమతించింది. పవన్ కల్యాణ్ నటించిన ఈ చిత్రం గత కొన్నేళ్లలో అత్యంత ఆసక్తికరమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ముఖ్యంగా ఆయన నటించిన హరి హర వీర మల్లు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సెప్టెంబర్ 25న ఉదయం 1 గంటకు బెనిఫిట్ షో నిర్వహించేందుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. అంతేగాదు టికెట్ ధరను గరిష్టంగా రూ.1,000గా నిర్ణయించింది. రోజుకు గరిష్టంగా ఐదు ప్రదర్శనలు మాత్రమే అనుమతించినప్పటికీ, విడుదల తర్వాత 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతిచ్చింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.125, మల్టీప్లెక్స్లలో రూ.150గా టికెట్ ధరలు నిర్ణయించబడ్డాయి.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా తన పదవిని దుర్వినియోగం చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను ప్రోత్సహిస్తాయని, కానీ పెంచడం విస్మయంగా ఉందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
