ప్రముఖ పంజాబ్ నటుడు, రైతుల ఉద్యమ సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న దీప్ సిద్ధూ ఇక లేరు. హరియాణాలోని సోనిపట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఢిల్లీ నుంచి భటిండా వైపు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో చనిపోయారు. ఆయన కారు ఆగివున్న ఓ ట్రక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పంజాబ్లోని ముక్త్సర్ జిల్లాకు చెందిన దీప్ లా చదివారు.
గతంలో మోడల్గా పనిచేసి.. తర్వాత పలు పంజాబీ చిత్రాల్లో నటించాడు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో దీప్ సిద్ధూ పాల్గొన్నారు. గతేడాది రైతులు చేపట్టిన రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో కీలక నిందితుడిగా దీప్ సిద్ధూ ఉన్నారు.
రైతుల ట్రాక్టర్ ర్యాలీతో సిద్ధూ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. కొందరు ఆందోళనకారులను రెచ్చగొట్టి ఎర్రకోట వైపు మళ్లించారనే ఆరోపణలు సిద్ధూపై ఉన్నాయి. రైతు ఉద్యమం దారి తప్పటానికి అతడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో నిందితుడిగా సిద్ధూ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. పంజాబ్లో దీప్ సిద్ధూకి భారీగా అభిమానులు ఉన్నారు.