హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా స్టాండప్ రాహుల్
. కూర్చుంది చాలు అనేది ట్యాగ్లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈనెల 18న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఫిలింనగర్ కల్చరర్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ఈ కథను దర్శకుడు శాంటో నాకు నాలుగు గంటలపాటు చెప్పాడు. ప్రతిదీ డిటైల్గా వివరించాడు. వెంటనే మరునిముషంలో చేస్తానని చెప్పాను. కానీ నాపై ఆయనకు నమ్మకం కలగలేదు. నేను చేస్తానన్నానుగదా! అని అంటే, కాదు. ఆడిషన్ కావాలి అన్నాడు.
అలా ఆడిషన్ చేశాక ఆయనకు నాపై పూర్తినమ్మకం ఏర్పడింది. ఈ సినిమా మా రెండేళ్ళ జర్నీ. స్టాండప్ రాహుల్ అంటే అలరించే కామెడీతోపాటు ఫ్యామిలీ డ్రామా కూడా వుంది. వర్ష పాత్ర చాలా క్యూట్ గా వుంటుంది. ఆమెకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని బాలన్స్ చేస్తూ, నా కుటుంబాన్ని కూడా చూసుకుంటూ స్టాండప్ కామెడీ ఎలా చేశాననేది ఇందులో దర్శకుడు బాగా డీల్ చేశారు. ఇటువంటి సినిమా ఇంతకుముందు రాలేదు. చిత్ర నిర్మాతలు కరోనా వచ్చి మధ్యలో ఆగిపోయినా చాలా నమ్మకంతో ఈ సినిమాకు ఎంతమేరకు కావాలో అన్ని సౌకర్యాలు కల్పించారు.
దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకముంది. థియేటర్లోనే సినిమాను చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండని తెలిపారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ, ఈ చిత్రం నాకేకాదు అందరికీ మంచి గుర్తింపు తెస్తుంది. కరోనా టైంలో అందరూ ఒత్తిడికి గురయ్యాం. ఆ టైంలో చక్కటి ఎంటర్టైన్ మెంట్ కోసం చూశాం. ఇలాంటి సినిమా చూస్తే మనకు రిలీప్ వుంటుంది. థియేటర్లో సినిమాను చూసి ప్రేక్షకులు చిరునవ్వుతో బయటకు వస్తారనే నమ్మకం నాకుందని అన్నారు.