- రాజమౌళి చిత్రం ఉండబోతుందని టాక్
- అన్నీ భాషల్లో విడుదలకు అవకాశం
,
ఒక్క ఫొటో తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తులపై తీవ్ర చర్చ సాగుతోంది. వాళ్లు ఏం సినిమా తీస్తున్నారు? సఇనిమా ఎలా ఉంటుంది? ఇంకా ఎవరెవరు నటిస్తారు? అని ఇలా ఒక్క ఫొటో చుట్టూ ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఫొటో విడుదలై దాదాపు వారమువుతున్నా ఆ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం దొరకడం లేదు. దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి, యువ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్తేజ ముగ్గురు కలిసి దిగిన ఫొటోను రాజమౌళి తన ట్విట్టర్లో పంచుకున్నారు. అప్పటి నుంచి ఈ ఫొటోపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎవరికి తోచింది వారు కథలు అల్లుకొని వారికి వారు సమాధానాలు చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు ఆ నటులతో ఓ మల్టీస్టారర్ సినిమా రాజమౌళి తీస్తాడని దాదాపు ఖరారైంది. ఈ విషయం చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ కూడా ఈ విషయంపై కొన్ని ఆసక్తికర అంశాలు చెప్పాడు. ఆ ఫొటో చూసినప్పుడు తాను ఆశ్చర్యపోయాడని, ఆ ఫొటోలో ఉన్నది వాస్తవమేనని, ముగ్గురు కలిసి సినిమా తీస్తున్నారని చెప్పి సస్పెన్స్కు తెర దీశాడు. అయితే ఇప్పుడు ఆ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందని టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోందని, ఈ సినిమాలో ఎన్టీయార్, చరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ బాక్సర్లుగా కనిపించనున్నారట. అలాగే ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని సమాచారం. దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్నైనా పెట్టడానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత దానయ్య సిద్ధంగా ఉన్నారట. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట.
అయితే ఈ సినిమా కోసం చరణ్, తారక్ దేహదారుఢ్యం మెరుగుపరుచుకోవడానికి శ్రమిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాకి ‘యమధీర’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని టాక్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. 2019 వేసవిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.