రామయణం నేపథ్యంలో రూ.500 కోట్లతో సినిమాగా తీస్తానని టాలీవుడ్లో కొందరు నిర్మాతలు ప్రకటించారు. ఆ సినిమా తీస్తామని గతేడాది ప్రకటించినా ఇంతవరకు ఆ సినిమా ముచ్చట లేదు. అయితే అత్యంత భారీ ఖర్చుతో రూపొందించే ఈ సినిమా ఉంటుందా.. లేదా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఈ సినిమా పక్కా ఉండనుందని ఇప్పుడు తెలుస్తోంది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించే ఈ రామాయణానికి అల్లు అరవింద్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిర్మాతలు బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుపై చాలా సీరియస్గా పనులు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో మహానగరంలో యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2018 కొనసాగుతోంది. ఆ సమావేశాల్లో ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో రామాయణం సినిమా షూటింగ్ చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని సినిమా నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన ధృవీకరించారు.
రామాయణం అంతా అయోధ్యలోనే జరిగింది. అందుకే ఉత్తరప్రదేశ్ కేంద్రంగా రామాయణం అధిక భాగం షూటింగ్ జరుపుకోనుంది. అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో దేశంలోనే.. అత్యంత కాస్ట్లీ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. మూడు భాగాలుగా రామాయణం రూపొందనుండగా.. మూడు భాషల్లో ఏకకాలంలో ఈ 3డీ రామాయణం విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేయాల్సి ఉంది.