తెలుగు తెరపై ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన ఆమె ప్రస్తుతం అమ్మమ్మ, భామ పాత్రల్లో కనిపిస్తూ ఆ రకంగా వృద్ధాప్యంలోనూ సినిమాలతో బిజీగా ఉన్న సీనియర్ నటి గీతాంజలి. హాస్యంతో కూడిన పాత్రలను చేస్తూ నవ్విస్తున్న గీతాంజలి ఇటీవల ఓ వెబ్ చానల్తో తన వ్యక్తిగత జీవిత విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త, నటుడు రామకృష్ణ విషయంపై ఆమె ఆవేదనకు గురయ్యారు.
ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి వేషం వేయడానికి ఉన్న ఏకైక నటుడు తన భర్త రామకృష్ణ అని తెలిపారు. రామకృష్ణ పెద్ద నటుడు.. ఆయన దాదాపు 250 సినిమాలు చేశారు. అలాంటి తన భర్తను మీడియా, ప్రభుత్వం, సినీ పరిశ్రమ పట్టించుకోలేదని గీతాంజలి వాపోయింది. “చిత్రపరిశ్రమలో పెద్దవాళ్లు ఉండగా పట్టించుకోరు .. పోయారనగానే పబ్లిసిటీ కోసం శ్రద్ధాంజలి జరుపుతారు. శోభన్బాబుగారు చనిపోతే శ్రద్ధాంజలి చేశారు. మరీ తన రామకృష్ణ చనిపోతే ఎవరైనా గుర్తు పెట్టుకుని శ్రద్ధాంజలి చేస్తున్నారా?” అని గీతాంజలి ప్రశ్నించారు.
‘ఎందుకు ఇలా తేడా చూపిస్తున్నారు? ఏం రామకృష్ణ పెద్ద నటుడు కాదా అని నిలదీశారు. ‘నోము’ సినిమా నుంచి రామకృష్ణ టాప్ హీరో అయిపోయారు. అలాంటి ఆయన విషయంలో ఎందుకు గౌరవం చూపించలేకపోతున్నారు? అని వాపోయారు. కొంతమంది పేరు మీదుగా ఎంతో మందికి పురస్కారాలు ఇస్తున్నారు. రామకృష్ణ గారి పేరు మీదుగా అవార్డులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? తన భర్తను ఎందుకు ఇలా పక్కన పెట్టేశారు అని తనకు బాగా కలచివేస్తోంది అని వాపోయారు.