- రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం
- విశేషాలు పంచుకున్న కోడలు
దాదాపు సంవత్సరం తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవి మేకప్ వేసుకున్నారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఖైదీ 150 సినిమా తర్వాత ఓ సినిమా చేయడానికి ఏడాది పట్టింది. అలాంటి ఇలాంటి కథలు కాకుండా ప్రత్యేకమైన కథల్లో నటిద్దామని డిసేడై చివరికి సైరాకు పచ్చజెండా ఊపారు. పరుచూరి బ్రదర్స్ అందించిన కథకు సురేందర్రెడ్డి కొన్ని మార్పులుచేర్పులు చేసి తుది కథ సిద్ధం చేశారు. ఆ సినిమా చిత్రీకరణ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇంతకుముందే పూజా కార్యక్రమాలు అయిపోగా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పుడు ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్లుక్ను ఎప్పుడో విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవిపై తొలిరోజు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదటి షాట్ చిత్రీకరించారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు చిరంజీవి, కేరక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీలపై తొలి షాట్ చిత్రీకరణ చేశారు. తన మామ సెట్స్కి వెళ్లిన విషయాన్ని కోడలు ఉపాసన ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు.
“కొణిదెల ఫ్యామిలీకి,.. మిస్టర్ సి (చరణ్)కి.. న్యూ బిగినింగ్ ఇది. రామ్చరణ్ నిర్మిస్తున్న రెండో చిత్రమిది. మామ మెగాస్టార్ నటిస్తున్న 151వ సినిమా కూడాను. సైరా – నరసింహారెడ్డి .. ది పవర్ ఆఫ్ ది క్యారెక్టర్స్.. టీమ్ ఎంతో ఉత్సాహంగా ముందుకెళుతోంది“ అంటూ ఉపాసన ట్వీట్ చేసింది.
తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాను దాదాపు రూ.150 కోట్లతో కుమారుడు రామ్చరణ్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ తదితర నటీనటులు ఈ సినిమాలో పాలుపంచుకోనున్నారు. 2019 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.