ఆర్జీవీ దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం వ్యూహం. అనేక అవాంతరాల మధ్య సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పొంది విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వ్యూహం సినిమా రిలీజ్పై స్టే ఇవ్వాలని కోరారు. ఇక ఇవాళ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
వ్యూహం సినిమా ద్వారా చంద్రబాబు,లోకేష్,పవన్ లను కించ పరిచే విధంగా సన్నివేశాలను రూపొందించారని లోకేష్ తరపు న్యాయవాది మురళీధర్ రావు వాదనలు వినిపించారు. దీనిపై సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బహిరంగంగానే బాబు, పవన్ లు తనకు ఇష్టం లేదని ఆర్జీవీ చెప్పారని వారిని కించపరిచేందుకే ఈ సినిమా తీశారని తెలిపారు. ఇక ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం వ్యూహం సినిమాపై స్టేకు నిరాకరించింది.