టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోలందరూ కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ ముగ్గురూ ఓకే చోట కనిపించడం చాలా అరుదు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన టాలీవుడ్ నటీ నటుల క్రికెట్ పోటీల్లో కనిపించిన తరువాత, వీరు ముగ్గురూ కలిసి ఒకేచోట మరోసారి కనిపించలేదు.
ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు పాల్గొన్నారు. కోదండరామిరెడ్డికి కేక్ తినిపించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వీరితో పాటు రాఘవేంద్రరావు, బి. గోపాల్, అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్ రాజు, అనిల్ సుంకర, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్రెడ్డి, సంగీతదర్శకుడు కోటి, కెమెరామెన్ రవీంద్రబాబు, శ్రీమిత్ర చౌదరి, శ్రీనివాస్ రాజు, కోదండరామిరెడ్డి కుమారులు సునీల్, వైభవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు