పవర్ స్టార్ పవన్ కళ్యాన్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రంతో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ షేక్ చేస్తూ.. భారీ వసూళ్లు రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఉన్న ఒడిశాలోనూ మంచి ఆదరణ లభిస్తోంది. పవన్ అభిమానులతో అక్కడ థియేటర్లు కిక్కిరిసి పోతున్నాయి.
ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ ఈ సినిమాను ప్రదర్శిస్తున్న గజపతి జిల్లా పర్లాఖెముండిలోని రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. ఇక్కడ ఉన్న రెండు థియేటర్లలో ‘వకీల్ సాబ్’ హౌజ్ ఫుల్ తో నడుస్తుంది. ఆదివారం అభిమానుల తాకిడి మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో అభిమానులు కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు.
అసలే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్న కారణంగా అధికారులు వెంటనే స్పందించారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ రెండు సినిమా థియేటర్లను తాత్కాలికంగా సీజ్ చేశారు.