సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా జన్యుపరమైన లోపం కారణంగా గర్భంలో శరీర భాగాలు ఒక్కటిగా కలిసిపోయి అవిభక్త కవలలుగా రూపాంతరం చెందుతాయి. దాదాపు రెండు లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా రాజ్నగర్ సమితి కనా గ్రామానికి చెందిన ఓ మహిళ అవిభక్త కవలలకు(ఆడశిశువులు) జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం పురిటి నొప్పులు మొదలవడంతో ఆమె భర్త రాజ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
పరీక్షల అనంతరం మహిళకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ప్రసవం చేశారు. ఆమె కడుపులో బిడ్డను చూసి వైద్యులు షాక్ తిన్నారు. అవిభక్త కవలలకు రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉండటం, వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కటక్ శిశుభవన్లో ఉంచారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలోని శిశు వైద్య నిపుణులు దేబాసిస్ సాహు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని తెలిపారు. అయితే, అల్ట్రాసౌండ్ పరీక్షల తర్వాత మరిన్ని వివరాలును వెల్లడిస్తామని అన్నారు.
కొన్నిసార్లు అరుదుగా ఇలా జరుగుతుందని వ్యాఖ్యానించారు. కూలి పనులు చేసే తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు.