మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అహిల్యానగర్ జిల్లా సంగమ్నేర్ తాలూకాలో 6వ తరగతి చదువుతున్న ఓ బాలికపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు.
వడ్గావ్ పాన్ స్కూల్లో చదువుతున్న ఆ బాలిక, సమ్మర్ షెడ్యూల్ కారణంగా ఉదయం జరిగిన తరగతులు ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా ఆమె ముందు ప్రత్యక్షమై, మాట్లాడకుండా ముఖంపై యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ దాడిలో బాలిక ముఖం, ముఖ్యంగా కుడి కన్ను తీవ్రంగా గాయపడ్డాయి. వెంటనే స్థానికులు ఆమెను రక్షించి లోనీ ప్రాంతంలోని ప్రవరణాగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమె పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
బాలిక కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సమీప ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
బాధితురాలు తన తల్లి, తాతమ్మలతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి లేరు. తల్లి రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతన్ని గుర్తించి అరెస్ట్ చేయడానికి చర్యలు కొనసాగిస్తున్నారు.
