ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అమానుషం జరిగింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థి సహచర విద్యార్థుల దాడికి గురై చూపు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. ఈ దాడి కారణంగా బాలుడు తీవ్రంగా గాయపడడంతో ప్రస్తుతం కమాండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
బాలుడి తల్లి కాంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, జనవరి 21న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో స్కూల్ మైదానంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. మరో సెక్షన్కు చెందిన ఐదో తరగతి విద్యార్థి, మూడో తరగతి విద్యార్థి కలిసి తన కుమారుడిపై దాడి చేశారని ఆమె ఆరోపించారు.
ఫిర్యాదు ప్రకారం, ఇద్దరు విద్యార్థులు బాలుడిని నేలకూల్చి, చెప్పు మడమతో అతని కళ్లపై, ముఖంపై రుద్దడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దాడి అనంతరం బాలుడు చూపు కోల్పోయాడని ఆమె తెలిపారు.
ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని బాలుడి తల్లి ఆరోపించారు. బాధ్యులైన విద్యార్థులపై, అలాగే నిర్లక్ష్యం వహించిన స్కూల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి జనవరి 30న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
