కాలిఫోర్నియాలోని లాంకాస్టర్కు చెందిన దంపతులు మౌరిస్ జువెల్ టేలర్ సీనియర్ (39), నటాలి సుమికో బ్రోత్వెల్ (49) తమ ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో జీవితాంతం జైలు శిక్షకు గురయ్యారు. 2020లో తమ 12 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె తలలు నరికిన హత్యలకు సంబంధించి సోమవారం కోర్టు వీరికి పరోల్ అవకాశమే లేకుండా జీవిత ఖైదు విధించింది.
శిక్ష ప్రకటించే సమయంలో న్యాయస్థానంలో తీవ్ర నిశ్శబ్దం నెలకొంది. ఈ నేరాన్ని న్యాయమూర్తి అత్యంత పాశవికమైన చర్యగా అభివర్ణించారు. ఇద్దరు పిల్లలను హత్య చేయడమే కాకుండా, బతికి ఉన్న తమ ఇద్దరు చిన్న కుమారులను ఆ దారుణ దృశ్యాలను చూడాల్సిందిగా బలవంతం చేసినందుకు ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది.
ఇది మొత్తం కుటుంబాన్నే ఛిద్రం చేసిన పాశవిక చర్య అని లాస్ ఏంజెలెస్ కౌంటీ జిల్లా అటార్నీ నాథన్ హోచ్మాన్ అన్నారు. ఇద్దరు నిర్దోషి పిల్లలను కిరాతకంగా హత్య చేశారు. వారి చిన్న సోదరులు ఊహించలేని భయానక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.శిక్ష ఖరారు సమయంలో బ్రోత్వెల్ తాను నిర్దోషినేనని వాదించినప్పటికీ, జ్యూరీ తీర్పును సమర్థించే బలమైన ఆధారాలు ఉన్నాయని, అలాగే ఇద్దరిలో ఎవరిలోనూ పశ్చాత్తాపం కనిపించలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
2020 నవంబర్ 29న లాంకాస్టర్లోని తమ ఇంట్లోనే ఈ దంపతులు పిల్లలను హత్య చేశారు. అనంతరం అప్పటికి 8, 9 ఏళ్ల వయసున్న తమ ఇద్దరు చిన్న కుమారులను గదుల్లో బంధించి, తమ అన్నాచెల్లెళ్ల తలలు నరికిన శవాలను చూడాలని బలవంతం చేశారు. కొన్ని రోజుల పాటు వారికి ఆహారం కూడా ఇవ్వలేదు.
వారు చిన్న పిల్లలను గదుల్లో బంధించి, ఆహారం లేకుండా ఉంచి, తమ అన్నాచెల్లెళ్ల మృతదేహాలను చూడాల్సిందిగా బలవంతం చేశారు అని జిల్లా అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్లైన్లో వ్యక్తిగత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న టేలర్ అకస్మాత్తుగా జూమ్ సమావేశాలకు లాగిన్ కావడం ఆపేయడంతో అతని క్లయింట్లు అనుమానంతో పోలీసులను సంప్రదించారు. పోలీసులు ఇంటికి చేరుకున్నప్పుడు, వేర్వేరు గదుల్లో పిల్లల మృతదేహాలను గుర్తించారు. పదునైన ఆయుధంతో కత్తితో లేదా కోయడం వల్ల గాయాలయ్యాయని దర్యాప్తు అధికారులు తెలిపారు.
కొద్ది రోజుల తర్వాత టేలర్ను పోలీసులు అరెస్టు చేశారు. బ్రోత్వెల్ను అరెస్టు వారెంట్ జారీ అనంతరం దాదాపు ఏడాది తర్వాత అరిజోనా రాష్ట్రంలోని టక్సన్లో అదుపులోకి తీసుకున్నారు. బతికి ఉన్న ఇద్దరు పిల్లలకు కోర్టు 10 సంవత్సరాల రక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వారు ఇతరుల సంరక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు.
