మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం, నందిని నారపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుతోంది. అయితే ఆమె తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన బయటపడింది.
సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. హాస్టల్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నందిని స్వస్థలం సిరిసిల్లా జిల్లాలోని చందుర్తి మండలం సనుగుల గ్రామంగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత సమస్యలేనా, చదువు ఒత్తిడేనా లేదా ఇతర కారణాలా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థి వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
