గాజియాబాద్లో ముగ్గురు మైనర్ సోదరీమణులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తర్వాత, వారి తండ్రి చేతన్ కుమార్కు సంబంధించిన 2015 నాటి మరో ఆత్మహత్య కేసు వివరాలు మళ్లీ బయటకు వచ్చాయి. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తుకు కొత్త కోణాన్ని జోడిస్తోంది.
ముగ్గురు సోదరీమణులు గాజియాబాద్లో తమ నివాస అపార్ట్మెంట్ నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటనకు కొన్ని రోజులు గడిచిన తర్వాత, 2015లో చేతన్ కుమార్ లివ్-ఇన్ పార్ట్నర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న కేసుతో ఆయనకు సంబంధం ఉందని పోలీసులు శనివారం ధృవీకరించారు. సీనియర్ పోలీసు అధికారులు కుటుంబ పరిస్థితులు, పిల్లల మానసిక స్థితి తదితర అంశాలను లోతుగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
డీసీపీ (ట్రాన్స్ హిండన్) నిమిష్ పాటిల్ పీటీఐకి తెలిపిన వివరాల ప్రకారం, 2015లో రాజేంద్ర నగర్ కాలనీలోని ఒక ఫ్లాట్ పైకప్పు నుంచి పడిపోయి చేతన్ కుమార్ లివ్-ఇన్ పార్ట్నర్ మృతి చెందింది. ఆ ఘటనను మొదట అనుమానాస్పద మృతిగా నమోదు చేసినప్పటికీ, విచారణ అనంతరం ఆత్మహత్యగా నిర్ధారించినట్లు చెప్పారు. అయితే ఆ పాత కేసుకు, ప్రస్తుతం ముగ్గురు సోదరీమణుల మృతికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, చేతన్ కుమార్కు ప్రస్తుతం సుజాత, హీనా, టీనా అనే ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరంతా జీవసంబంధ సోదరీమణులే. సుజాతకు నిషిక (16) కుమార్తె కాగా, హీనాకు ప్రాచి (14), పాఖీ (12) పిల్లలు. పిల్లల గదిలో లభించిన సూసైడ్ నోట్లో వారు తల్లి కంటే తండ్రితోనే ఎక్కువ భావోద్వేగ అనుబంధం కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఆ నోట్లో తండ్రినే ఉద్దేశించి రాసి, తల్లుల గురించి ప్రస్తావించలేదని ఒక అధికారి తెలిపారు. అదనంగా తొమ్మిది పేజీల పాకెట్ డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తండ్రి మొబైల్ ఫోన్లు తీసివేయడంతోనే పిల్లలు తీవ్రంగా కలతకు గురయ్యారని పోలీసులు తెలిపారు. కొరియన్ యాప్లు, ఆన్లైన్ గేమ్స్, విదేశీ స్నేహితులతో ఎక్కువగా మమేకమవుతున్నారని గమనించిన చేతన్ కుమార్ వారి ఫోన్లను తీసేసి, తర్వాత వాటిని అమ్మేశాడని చెప్పారు.ఘటన జరిగిన రాత్రి పిల్లలు తల్లి ఫోన్ తీసుకున్నప్పటికీ, అందులో కొరియన్ యాప్లు లభించలేదని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని పాటిల్ తెలిపారు.
