తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోరం జరిగింది. కోడలి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించి మందలించినందుకు మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజేంద్రన్ (64) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, రాజేంద్రన్ కుమారుడి భార్య జయప్రియకు మణికందన్తో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రన్ కోడలిని పలుమార్లు హెచ్చరించి, కుటుంబ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. దీనిపై కోపం పెంచుకున్న జయప్రియ తన ప్రియుడు మణికందన్తో కలిసి రాజేంద్రన్ను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన రోజు బైక్పై వెళ్తున్న రాజేంద్రన్ను అడ్డుకున్న మణికందన్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో చిక్కుకున్న రాజేంద్రన్ రోడ్డుపై ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్లు రాజేంద్రన్కు సుమారు 70 శాతం కాలిన గాయాలయ్యాయని తెలిపారు. పరిస్థితి విషమంగానే ఉన్నా చికిత్స కొనసాగుతోందన్నారు. ఈ ఘటనకు సంబంధించి కోడలు జయప్రియ, ఆమె ప్రియుడు మణికందన్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
