బీహార్లో రవాణా సౌకర్యాలు, ఆర్థికాభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 22, శుక్రవారం, ఆంటా–సిమారియా వంతెనను (NH-31పై గంగా నది మీద) ప్రజలకు అంకితం చేయనున్నారు. సుమారు ₹1,870 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఆరు లేన్ల వంతెన 1.86 కి.మీ పొడవు కలిగి ఉంది. వంతెనకు సంబంధించిన దారి పొడవుతో కలిపి మొత్తం 8 కి.మీ పైగా విస్తరించింది.
ప్రధాని మోదీ సుమారు 30 నిమిషాలు సిమారియాలో ఆగి, కొత్త వంతెనపై నడిచే అవకాశం ఉంది. 2017 అక్టోబర్ 14న ఈ వంతెనకు మోదీ పునాది రాయి వేశారు.
వంతెన ప్రత్యేకతలు
ఆంటా–సిమారియా గంగా వంతెన 1.86 కి.మీ పొడవైన ఆరు లైన్ల రహదారి.ఇది పట్నా జిల్లా మొకామా మరియు బేగుసరాయ్ల మధ్య నేరుగా అనుసంధానాన్ని కల్పిస్తుంది.
ఇప్పటి వరకు భారీసరుకు వాహనాలు అదనంగా 100 కి.మీ పైగా తిరుగుదారి పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ దూరం గణనీయంగా తగ్గిపోనుంది.ఉత్తర బీహార్ జిల్లాలు (బేగుసరాయ్, సుపౌల్, మధుబనీ, పూర్నియా, అరరియా) మరియు దక్షిణ బీహార్ జిల్లాలు (శేఖ్పురా, నవాదా, లక్షీసరాయ్) మధ్య రవాణా సౌకర్యం మెరుగవుతుంది.
రవాణా సౌలభ్యం మాత్రమే కాకుండా ఉత్తర బీహార్ ఆర్థికాభివృద్ధికి కూడా ఇది తోడ్పడనుంది.ఈ వంతెన సిమారియా ధామ్ (ప్రసిద్ధ యాత్రాకేంద్రం)కు, కవి రామధారి సింగ్ దిన్కర్ జన్మస్థలానికి చేరుకోవడాన్ని మరింత సులభతరం చేస్తుంది.
బీహార్ రహదారుల నిర్మాణశాఖ మంత్రి నితిన్ నవీన్ మాట్లాడుతూ ఈ వంతెన ఉత్తర–దక్షిణ బీహార్ దూరాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర పురోగతికి మార్క్గా నిలుస్తుందని తెలిపారు.
