సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ఏపీ ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. ప్రధాన పార్టీల ముఖ్యనేతలంతా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కానున్నారు. ఇక ఎన్నికల రేసులో ముందువరుసలో ఉన్న జగన్…రేపటి నుండి ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. 21 రోజుల పాటు ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు జగన్.
బస్సు యాత్రలో భాగంగా ప్రతీ రోజు ఒక బహిరంగసభ, స్థానిక ప్రజలతో సమావేశాలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్. ప్రొద్దుటూరులో రేపు జరిగే తొలి బహిరంగ సభలో పాల్గొననున్నారు జగన్. సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల యాత్ర చేపట్టనున్నారు వైసీపీ అధినేత.
ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ప్రజలతో భేటీ అవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. అలాగే పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. జగన్ బస్సుయాత్ర నేపథ్యంలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి.