ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఎల్లుండి రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో సొంతగూటికి చేరుకోనున్నారు. ఇప్పటికే తన చేరికకు సంబంధించి కేసీ వేణుగోపాల్తో చర్చించారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎల్లుండి మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్లో చేరికకు ముహుర్తం ఖారారైంది. బీజేపీలో తనకు సహకరించిన నేతలందరికి ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఇవాళ కార్యకర్తలతో భేటీ సందర్భంగా తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది…తిరిగి కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నానో వివరించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం జరిగే సమావేశంలో ముఖ్య నాయకులకు సమాచారం అందించారు.
వాస్తవానికి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ పని తెలంగాణలో అయిపోయిందని…జాకీ పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. బ్లాక్ మెయిలర్,బ్రోకర్ అంటూ పరుశ పదాలు వాడారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ కొలుకునే పరిస్థితి లేకపోవడంతో తిరిగి సొంతగూటికే చేరేందుకు మొగ్గుచూపారు. ఇక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక వెనుక ప్రధానంగా ఆయన అన్న వెంకట్రెడ్డే ఉన్నారు. మరి రాజగోపాల్ చేరిక తర్వాత పార్టీలో ఎలాంటి అసంతృప్తి రాజుకుంటుందో వేచిచూడాలి..