బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగలనుంది. స్వయంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బుజ్జగించినా పార్టీ వీడేందుకే సిద్ధమయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు మాజీ మంత్రి మల్లారెడ్డి. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరికకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇక ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరబోతున్నారని సమాచారం.
ఇక అలాగే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం కారు దిగేందుకే సిద్ధమయ్యారు. నిన్న వరంగల్లో హైడ్రామా నెలకొనగా రమేష్ను కేసీఆర్తో భేటీ చేయించారు ఆ పార్టీ నేతలు. అయితే చల్లబడ్డట్టే కనబడ్డ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. బీజేపీలో చేరేందుకు ఈ ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి హస్తినకి చేరుకున్నారు.
మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను ఒక్కొ నేత వీడుతున్నారు. స్వయంగా గులాబీ బాస్ చెప్పినా నేతలు వినకపోవడం విశేషం. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున చేరికలుంటాయని ప్రచారం జరుగుతోంది.