తెలంగాణ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే సీటు దక్కని నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అలాగే పలువురు మాజీ ఎమ్మెల్యేలు సైతం కారు దిగారు. వీరిందరికి హస్తం పార్టీ సేఫ్ జోన్గా మారింది. ఇక నిన్న మేడ్చల్ సీఎం కేసీఆర్ సభ ముందు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్లో చేరగా తాజాగా ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నారు రేఖా నాయక్. బస్సు యాత్ర రేపు నిజామాబాద్ జిల్లాకు రానుండగా ఆర్మూర్ లో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఖానాపూర్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రేఖా నాయక్. అయితే తాజాగా టికెట్ వస్తుందని భావించినా మంత్రి కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. దీంతో అప్పటినుండి పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రేఖా నాయక్.
ఈసారి కాంగ్రెస్ బీ ఫామ్పై అసిఫాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. రేఖానాయక్ చేరికతో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఎంతమంది నేతలు పార్టీని వీడినా బీఆర్ఎస్ మాత్రం లైట్గానే తీసుకుంటోంది. కనీసం అసంతృప్తులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు.