ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం-మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జాండీస్ వ్యాధి వ్యాప్తి కారణంగా ఇద్దరు విద్యార్థినులు మరణించడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. దసరా సెలవుల అనంతరం పాఠశాలకు తిరిగి వచ్చిన తర్వాత 41 మంది విద్యార్థినులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మరణించిన విద్యార్థినులను కంభగూడు గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని అంజలి పువ్వుల, డండుసూరు గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని టోయాకా కల్పనగా గుర్తించారు. పాఠశాలలోని లోపభూయిష్టమైన ఆర్ఓ యూనిట్ కారణంగా నీటి కాలుష్యం ఏర్పడి జాండీస్ వ్యాప్తి చెందిందని అధికారులు తెలిపారు. మొత్తం 600 మంది విద్యార్థినులను వైద్యపరీక్షలు చేయగా, 120 మందిలో వైరల్ ఫీవర్ లేదా జాండీస్ లక్షణాలు గుర్తించబడ్డాయి. వీరిలో 37 మంది పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వారిని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. చంద్రబాబు పరిపాలనా నిర్లక్ష్యమే ఈ గిరిజన విద్యార్థినుల మరణాలకు కారణమని ఆరోపించారు. సర్కారు పాఠశాలల పట్ల పూర్తిగా ఉదాసీనత చూపుతున్నారని మండిపడ్డారు. మీ నిర్లక్ష్యం, మీ పాలనా వైఫల్యం వల్ల ఈరోజు పేద విద్యార్థినులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనీసం కరుణ కూడా లేదు అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు తక్షణమే ఒక్కొక్కరికి ₹25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ పాలనలో నిర్మించిన పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను చంద్రబాబు ప్రభుత్వం “ధ్వంసం” చేసిందని, విద్యార్థుల సంక్షేమం కంటే ప్రైవేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. వైసీపీ పాలనలో అమ్మఒడి, డిజిటల్ క్లాస్రూమ్లు, ఇంగ్లీష్ మీడియం బోధన, అవసర సదుపాయాల మెరుగుదల వంటి పలు సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలను “విద్యాలయాల ఆలయాలుగా” మార్చామని జగన్ గుర్తు చేశారు. అయితే ప్రస్తుత టిడిపి నేతృత్వంలోని ప్రభుత్వంలో “ఆర్ఓ ప్లాంట్లు, హాస్టళ్ల నిర్వహణ కూడా అవినీతి, నిర్లక్ష్యానికి బలి అయిందని” ఆయన అన్నారు.
