ఉభయగోదావరి జిల్లాల్లో దెందలూరు నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇప్పటివరకు తనకు ఎదురులేదంటూ గొప్పలు చెప్పుకున్న టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ను గత ఎన్నికల్లో మట్టికరిపించారు వైసీపీ నేత, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. గత ఎన్నికల్లో మాస్ లీడర్కి క్లాస్ లీడర్కి మధ్య జరిగిన పోరులో క్లాస్ అబ్బయ్య చౌదరి విజయం సాధించారు.
ఈ కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. ఓటింగ్ పరంగా బీసీ, ఎస్సీల ఓట్లు ఎక్కువగా ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఇక దెందలూరును తన అడ్డగా మార్చుకున్నారు చింతమనేని. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు,రౌడీయిజంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అలాంటి చింతమనేనికి చెక్ పెట్టడంలో సక్సెస్ అయ్యారు అబ్బయ్య చౌదరి.
కొల్లేరు పరివాహక ప్రాంతంతోపాటు దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2 లక్షల 20 వేల 274 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 16 వేల ఓట్ల తేడాతో చింతమనేనిపై అబ్బయ్య గెలవగా ఈసారి వీరిద్దరి మధ్యే పోరు జరుగుతోంది.
కొఠారు రామచంద్రరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు అబ్బయ్య చౌదరి. 2009లో తండ్రిని ఓడించిన చింతమనేనిపై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. తనదైన మాటతీరుతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక ఈసారి విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు అబ్బయ్య.నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దీనికి తోడు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్దే ఈసారి గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు.
ఇక చింతమనేని వైఖరి టీడీపీ నేతలకే నచ్చదు. నాయకులు, కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించడం ఆయనకు అలవాటే. అందుకే కూటమి నేతలు సైతం చింతమనేని దూరంగా ఉంటూ వస్తున్నారు. జనసేన మహిళా నేతను ఉద్దేశించి చింతమనేని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అందుకే ఈసారి చింతమనేని భంగపాటు తప్పేలా కనిపించడం లేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.