తెలంగాణ కాంగ్రెస్ ఆత్మ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఏం కావాలన్న ఆ పార్టీ నేతలు హస్తినకు వెళ్లి చేసుకునేవారు. ఇక తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన ఏ నిర్ణయమైనా ఢిల్లీ నుండి రావాల్సిందే. అయితే ఇప్పుడు కాస్త చేంజ్ అయింది. తెలంగాణ వయా బెంగళూరు టూ ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.
ఇందుకు ప్రధానకారణం తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దీంతో ఇప్పుడు కాంగ్రెస్లో ఏ చేరిక అయినా , మార్పుల అయినా ఆయనే స్వయంగా చూసుకుంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న డీకే…తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఆయన హైదరాబాద్ రాకున్న నేతలను తనవద్దకే రప్పించుకుంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ కూడా పలుమార్లు డీకేను కలిశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అలాగే షర్మిల సైతం తన పార్టీని డీకే ద్వారా కాంగ్రెస్లో విలీనం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇక రీసెంట్గా మోత్కుపల్లి నర్సింహులు సైతం బెంగళూరు వెళ్లి డీకేను కలిశారంటే తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఎంత ఫోకస్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే కాంగ్రెస్ నేతలు ఇది పాజిటివ్ కోణంలోనే తీసుకుంటున్నా అధికార బీఆర్ఎస్ మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఇప్పటివరకు ఢిల్లీలో తాకట్టుపెట్టారు..ఇకపై ఢిల్లీతో పాటు బెంగళూరు కేంద్రంగా నడుపుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.