సామాన్య ప్రజలపై వంటగ్యాస్ భారం మరోసారి పెరిగింది. గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను రూ. 29 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకాలు ఏర్పడటంతో గత మూడు నెలల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి.
పెరిగిన ఈ కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. అంతకుముందు మార్చి నెలలో కూడా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఢిల్లీలో సిలిండర్ ధరపై రూ. 60 పెరిగిన సంగతి తెలిసిందే. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఇదివరకు రూ. 913 గా ఉన్న 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 942 కి చేరుకుంది.
అంతర్జాతీయంగా సరఫరా లోపాల కారణంగా ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (విమాన ఇంధనం) ధరలను పెంచింది. తాజాగా వంటగ్యాస్ ధరను కూడా పెంచాల్సి వచ్చింది. ప్రస్తుత ధరల పెంపునకు ముందే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు విక్రయించే ప్రతి డొమెస్టిక్ సిలిండర్పై దాదాపు రూ. 703 నష్టం వస్తోందని, ఈ తాజా పెంపు ఆ నష్టాన్ని కొంతవరకు మాత్రమే పూడ్చగలదని చమురు సంస్థల వర్గాలు తెలిపాయి.
హోటళ్లు, రెస్టారెంట్లు మరియు వ్యాపార సంస్థలు ఉపయోగించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు గత కొన్ని నెలలుగా నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్నాయి.: ఇటీవలే జూన్ 1న వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 42 పెంచడంతో దీని ధర రూ. 3,113 కి చేరింది. అంతకుముందు మే నెలలో ఏకంగా రూ. 1,000, ఏప్రిల్లో రూ. 195.5,మార్చిలో రూ. 114.5 చొప్పున కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి. నిత్యావసరాల ధరలతో పాటు వంటగ్యాస్ ధర కూడా భారీగా పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతోంది.
