రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. అధికారం, అవసరమే పరమావధి. కోపం వస్తే ఎంతైనా తిడతారు…అదే కోపం అవసరంగా మారితే తప్పుచేశామని బేషరతుగా ఒప్పుకుంటారు.తాజాగా ఏపీలో 2019 ఎన్నికల తర్వాత జరిగింది ఇదే. 2019 ఎన్నికలకు ముందు బీజేపీపై దుమ్మెత్తిపోసిన టీడీపీ ఆ తర్వాత స్వరం మార్చి జగన్ని టార్గెట్ చేస్తూ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా టీడీపీ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకు రావడంతో చంద్రబాబు కటకటాల పాలు కావాల్సిన పరిస్థితి.
ఆ తర్వాత చంద్రబాబు తనయుడు లోకేష్ 15 రోజులకు పైగా ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ పెద్దలను కలవలేని పరిస్థితి. ఇక రేపో మాపో లోకేష్ అరెస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలయ్య రంగంలోకి దిగారు. బీజేపీతో సంప్రదింపుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా త్వరలోనే ఢిల్లీ పెద్దలను కలుస్తానని…చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీ నేతలను నిందించలేమని చెప్పుకొచ్చారు.
అదేవిధంగా కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని అనవసరంగా ఎవరిపైనా నిందలు వేయమని చెప్పారు. ఇక పనిలో పనిగా ఎన్టీఆర్ ఇష్యూపై స్పందించారు బాలయ్య. ఎన్టీఆర్, సినీ పరిశ్రమ ఎవరు స్పందించక పోయినా ఐ డోంట్ కేర్ అంటూ తీసిపారేశారు. దీంతో ఓ వైపు బెదిరిస్తూనే మరోవైపు కేంద్రంతో రాజీకి బాలయ్య సిద్ధపడుతున్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏదిఏమైనా ఇవాళ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచినా ప్రజాక్షేత్రంలో టీడీపీ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.