నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టి చివరి సీఎం. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటు వస్తున్నారు కిరణ్ కుమార్. అయితే ఆ తర్వాత కాంగ్రెస్లోకి మళ్లీ బీజేపీలో చేరిపోయారు. ఇక బీజేపీలో చేరినా ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీకి ఆసక్తిచూపిస్తున్నారు కిరణ్.
ఇందుకోసం రాజంపేట ఎంపీ స్థానాన్ని సేఫ్ జోన్గా ఎంచుకున్నారు.టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరడం లాంఛనమే కావడంతో కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు రాజంపేటలో చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రబాబు గతంలోనే రాజంపేట ఎంపీ ఇంఛార్జీగా సుగవాసి సుబ్రమణ్యంను ప్రకటించినా పొత్తులో భాగంగా ఈ సీటును వదులుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నల్లారి పోటీ ఖాయమైతే వైసీపీ నుండి గట్టిపోటీ ఎదురవడం ఖాయం. వైసీపీ నుండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేయనుండటంతో పోటీ ఆసక్తికరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారనే వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.