టీడీపీ – జనసేన పొత్తు కన్ఫామ్ అయింది. ఇవాళ్టి నుండి ఉమ్మడి కార్యాచరణతో ప్రజాక్షేత్రంలోకి దిగనుండగా ఇక ఈ కూటమికి నేతృత్వం వహించేందుకు సిద్ధమయ్యారు పవన్. దీంతో పవన్ అనుకున్నట్లుగా ఆయన సీఎం కావడానికి మరో అడుగు ముందు పడినట్లేనని పలువురు భావిస్తున్నారు. ఇక చంద్రబాబు జైలులో ఉండగా ఆయన ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఒకవేళ బెయిల్పై వచ్చిన బాబుపై ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. దీంతో బాబు సరిగ్గా ప్రచారం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ – జనసేన కూటమికి పవనే పెద్దదిక్కు కానున్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన 30 సీట్లు సాధిస్తే చాలు పవన్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ కూటమిలో బీజేపీ చేరికపై విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ చాలా కాలంగా బీజేపీ స్నేహాస్తం కోసం ఎదురుచూస్తోంది. తాజాగా పవన్ స్టేట్మెంట్తో పాటు లోకేష్ ఢిల్లీకి వెళ్లడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అనంతరం ఏపీలో టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందని సమాచారం. ఏపీ బీజేపీ నేతలు మాత్రం పొత్తుపై స్పందించడం లేదు.
ఇక పవన్ పక్కా వ్యూహాత్మకంగానే పొత్తు కన్ఫర్మ్ చేశారనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఓ వైపు కేంద్రం జమిలి ఎన్నికలవైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యం లేదు. అందువల్ల నిన్న జైల్లో చంద్రబాబుతో భేటీ అయిన పవన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారట. ఈ చర్చల్లో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడి సిఎం అభ్యర్థిగా పవన్ ఉండేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఇప్పుడు పవన్ నామజపంతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కగా ఈసారి అసెంబ్లీలో తమకు ప్రాతినిధ్యం వస్తుందని జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
