ఏపీలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు – జనసేన అధినేత పవన్. ఇక పొత్తులో భాగంగా జనసేనకు 28 నుండి 30 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలపై దాదాపు కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలియగా ఈ ఎఫెక్ట్ టీడీపీ నేతలపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఎందుకంటే జనసేనతో పొత్తును అస్సలు ఊహించలేదు తెలుగు తమ్ముళ్లు. కానీ ఎన్నికలకు ముందు పొత్తు పొడవగా అది ఎవరికి ఎసరు వస్తుందోనని అప్పటినుండే టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. అయితే తాజాగా టీడీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు సీనియర్ నేతల సీట్లకు ఎసరు వచ్చినట్లు తెలుస్తోంది.
ఒకరు రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాగా మరొకరు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. అయితే వైసీపీ హవాలోనూ బుచ్చయ్య చౌదరి గెలవగా అనంతపురం అర్బన్లో మాత్రం ప్రభాకర్ ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ రెండు స్థానాల కోసం జనసేన గట్టిగా పట్టుపడుతుండగా దాదాపు వీటిని పవన్కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు.
ఇందుకు కారణం లేకపోలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వయస్సు మీద పడగా అనంతపురం అర్బన్లో జేసీ బ్రదర్స్తో ప్రభాకర్ చౌదరి విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సీట్లను వదిలించుకునేందకు బాబు సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్రభాకర్కు టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ ఇద్దరు నేతల పరిస్థితి ఏంటా అన్నది చర్చనీయాంశంగా మారింది.