తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. నిన్న బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి. ఇక ముదిరాజ్ నేతలను టార్గెట్ చేసిన బీఆర్ఎస్…పెద్ద ఎత్తున వారిని చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు మిమిక్రీ ఆర్టిస్ట్ బిత్తిరి సత్తి. త్వరలో ఆయన బీఆర్ఎస్లో చేరనుండగా తాజాగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సైతం బీఆర్ఎస్లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది.దీంతో టీటీడీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాసాని బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. ముదిరాజ్ సామాజిక వర్గంలో కాసానికి మంచి పట్టు ఉంది. ఇది బీఆర్ఎస్కు ఉపయోగపడుతుందని భావించిన ఆ పార్టీ నేతలు కాసానిని కారెక్కించేందుకు సిద్దమయ్యారు.
ఇప్పటికే పాలమూరు చెందిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన చేరిక ద్వారా కాసాని కారెక్కేందుకు మార్గం సుగుమమైందని సమాచారం. మొత్తంగా కాసాని సైకిల్ దిగితే ఆ పార్టీ ఉనికి మరింత కొల్పోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.