టీడీపీ ఫైనల్ లిస్ట్ పుణ్యమాని మరోసారి అసంతృప్తి రాజుకుంది. అనంతపురం అర్బన్ సీటును దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ని తగలబెట్టారు. ఇక చీపురుపల్లి టికెట్ ఆశీంచిన విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేశారు.
చీపురుపల్లి స్థానాన్ని కళా వెంకట్రావుకు కేటాయించారు చంద్రబాబు. దీంతో తనకే టికెట్ వస్తుందని ఆశీంచిన నాగార్జునకు భంగపాటు తప్పలేదు. దీంతో పార్టీకి రాజీనామా చేసిన ఆయన..కళా వెంకట్రావుకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు.
నాగార్జున మద్దతు దారులు టీడీపీ కరపత్రాలు, పోస్టర్లను చించేసి కాల్చేశారు. చంద్రబాబు, లోకేష్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కళా వెంకట్రావ్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా అనంతపురం అర్బన్,చీపురుపల్లిలో టీడీపీ ఆఫీస్లు ధ్వంసం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.