బీహార్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో, ఆయన స్థానంలో సామ్రాట్ చౌదరి బీహార్ 21వ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. బీహార్ రాష్ట్ర చరిత్రలో భారతీయ జనతా పార్టీ (BJP)కి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఇదే తొలిసారి.
పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ సామ్రాట్ చౌదరితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు జేడీయూ (JDU) ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారంతో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన 19వ రాష్ట్రంగా బీహార్ నిలిచింది. అలాగే బీజేపీ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన 57వ వ్యక్తిగా సామ్రాట్ చౌదరి నిలిచారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీకి, బీహార్లో సొంతంగా పీఠం దక్కడం ఒక మైలురాయిగా నిలిచింది.
జేడీయూ అధినేత నితీష్ కుమార్ మంగళవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన కేబినెట్ను రద్దు చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు నితీష్ ప్రభుత్వంలో సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కీలకమైన హోం శాఖను నిర్వహించారు. 2017లో బీజేపీలో చేరిన ఆయన, మంగళవారం జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో నాయకుడిగా ఎన్నికయ్యారు.
బీహార్ రాజకీయాల్లో సామ్రాట్ చౌదరి ఎంపిక అత్యంత కీలకం. రాష్ట్రంలో ప్రభావవంతమైన కోయిరీ (Koeri) సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయిన రెండో నేతగా ఆయన రికార్డు సృష్టించారు. గతంలో 1968లో సతీష్ ప్రసాద్ సింగ్ కేవలం ఐదు రోజులు మాత్రమే సీఎంగా పనిచేశారు. 968లో జన్మించిన సామ్రాట్ చౌదరిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లి పార్వతీ దేవి కూడా 1998లో ఎమ్మెల్యేగా పనిచేశారు.
1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్, తొలుత లాలు ప్రసాద్ యాదవ్ (RJD), ఆ తర్వాత నితీష్ కుమార్ (JDU) పార్టీలలో పనిచేశారు. 2017లో బీజేపీలో చేరి పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
