ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద నిజంగా పండగ వాతావరణమే నెలకొననుంది. సంక్రాంతి అనగానే కొత్త అల్లుళ్ల రాక, కోడి పందాలు,నోరూరించే వంటకాలు ఇలా ప్రతి ఇల్లు వెలగిపోతుంటుంది. ఇక బాక్సాఫీస్ వద్ద అయితే సంక్రాంతికి పోటీ పడేందుకు హీరోలు సైతం తెగ ఆసక్తికనబరుస్తారు. అందుకే ప్రతి సంక్రాంతికి వచ్చే సినిమాలపై అందరిలో భారీ అంచనాలుంటాయి.
అయితే ఈ సారి బాక్సాఫీస్ వద్ద వచ్చే సినిమాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఆరు సినిమాలు రిలీజ్ డేట్ని ప్రకటించగా మహేష్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, విక్టరీ వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్ ఉన్నాయి. అలాగే శివ కార్తికేయన్ సినిమా సైతం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇన్ని సినిమాలు లైన్లో ఉండగానే తాజాగా ధనుష్ కూడా రేసులోకి వచ్చేశాడు.
ధనుష్ హీరోగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సైతం సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఎవరికి థియేట్లర్లు దొరుకుతాయి…ఎవరికి నిరాశే ఎదురవుతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
తెలుగు సినిమాలకే రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఆశించిన స్థాయిలో దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ధనుష్ ఏం ఆశించి తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడో తెలియని సిచ్యువేషన్. పెద్ద నిర్మాతలైన దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ కెప్టెన్ మిల్లర్ తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకుంటే తప్ప టికెట్లు దొరకని పరిస్థితి. ఏదిఏమైనా ఈ సారి బాక్సాఫీస్ ముందు సంక్రాంతి సినిమాలతో సందడిగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.