ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ – జనసేన నేతలు స్పీడ్ పెంచారు. ఇప్పటికే సమన్వయ కమిటీల పేరుతో కీలక నేతలు పర్యటిస్తుండగా మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ కంటే ముందు జరిగిన మహానాడులో మినీ మేనిఫెస్టో రూపంలో కొన్ని అంశాలను ప్రకటించారు టీడీపీ నేతలు. అయితే తాజాగా ఎవరూ ఉహించని విధంగా టీడీపీతో జనసేన జట్టు కట్టడంతో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనలో బిజీ అయిపోయారు ఇరు పార్టీల నేతలు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ ఎజెండాలో ఆరు కీలక అంశాలు ఉండగా జనసేన ఎజెండాలో 5 అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అనేక తర్జనభర్జనల అనంతరం ఉమ్మడి మేనిఫెస్టోలో 8 అంశాలు ప్రజల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారట.
విశ్వసనీయ సమాచారం…అమరావతి రాజధానిగా కొనసాగింపు,ఆర్ధిక వ్యవస్థ మెరుగు పడేందుకు ప్రణాళికల రూపకల్పన, స్టార్టప్ లకు ప్రోత్సాహం (రూ.10 లక్షల వరకు రాయితీ), రైతులకు ప్రోత్సాహకాలు(అక్వా,ఉద్యాన,పాడి రైతులు), కార్మికుల సంక్షేమంతో పాటు పేదలకు ఉచిత ఇసుక,వైసీపీ రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పున:పరిశీలన,బీసీలకు రక్షణ చట్టం,రాష్ట్రాన్ని సంక్షోభం నుండి బయటకు తీసుకొచ్చే విధానాలు ఇలా 8 అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు సమాచారం. వీటినే ఫైనల్ చేస్తారా లేదా మరిన్ని ప్రజాకర్షక పథకాలు తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది.