తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దని, ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో మాట్లాడుతూ ఆయన హైదరాబాద్ నగర భవిష్యత్ అభివృద్ధిపై విస్తృతంగా వివరించారు.
దేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల గురించి చర్చిస్తామని, ప్రతి నగరానికి ప్రత్యేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. కాలుష్యం, వరదలు, ట్రాఫిక్ వంటి సమస్యలను ఉదాహరణగా పేర్కొన్నారు.
హైదరాబాద్ను “రాక్స్ అండ్ లేక్స్ సిటీ”గా అభివర్ణిస్తూ, నగరానికి గొప్ప చారిత్రక వారసత్వం ఉందన్నారు.చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు నగర గౌరవాన్ని పెంచుతున్నాయని చెప్పారు. అయితే వాహనాల పెరుగుదల, పార్కింగ్ కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
“తెలంగాణ రైజింగ్ 2047” దృష్టితో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించినట్లు వెల్లడించారు. కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలికి తరలించడం ద్వారా నగరాన్ని నివాసయోగ్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ సమస్యల నివారణకు అండర్పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లు, సర్ఫేస్ రోడ్ల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. మెట్రో విస్తరణకు కేంద్రం సహకారం లభిస్తోందని, లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
మూసీ నది అభివృద్ధిపై కూడా సీఎం ప్రాధాన్యత ఇచ్చారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులపై రాజకీయాలు చేయకుండా సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు.
మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎవరినీ నిరాశ్రయులను చేయమని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తూ, అభివృద్ధికి అందరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
