విజయనగరం జిల్లా గోపాలరాయుడుపేట పంచాయతీలో గిరిజనులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. తమ సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, మెడకు ఉరి తాళ్లు బిగించుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలు పాల్గొనగా, పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకొని తమ బాధను వెలిబుచ్చారు. తమ గోడును వినిపించుకోవడానికి ఇంత తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టాల్సి వచ్చిందని వారు వాపోయారు.
గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపా వలస, రమణ వలస, దీవెన వలస, సీయోను వలస, చిన్నాకిన వలస గ్రామాల్లో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. మౌలిక వసతులు, పింఛన్లు, రేషన్, భూ హక్కులు, ఉపాధి వంటి కీలక సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని గ్రామస్తులు తెలిపారు. ట్రైబల్ అధికారులు కనీసం తమ వైపు చూసే పరిస్థితి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో చివరకు ఈ తరహా నిరసన చేపట్టామని గిరిజనులు పేర్కొన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
