పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నుండి వైద్య పరికరాలను తరలించినందుకు టిడిపి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పులివెందుల మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి నుండి పరికరాలను గుంటూరు, కర్నూలు వైపు తరలించాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయన ఆరోపించారు.
టిడిపి ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) మోడల్లో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించింది. పులివెందుల ప్రజలపై టిడిపి ప్రభుత్వానికి ఎందుకు పగ ఉందని ప్రశ్నించిన అవినాష్ అన్నారు. ముందుగా చంద్రబాబు నేషనల్ మెడికల్ కమిషన్కి లేఖ రాసి, పులివెందుల మెడికల్ కాలేజ్లో తరగతులు ప్రారంభించేందుకు అనుమతి నిరాకరించారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ పాలనలో కొనుగోలు చేసిన ఆధునిక పరికరాలను గుంటూరు, కర్నూలు వైపు తరలిస్తున్నారు అని తెలిపారు.
10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వచ్చిన ఆందోళనలకు టిడిపి ప్రభుత్వం ఇంకా స్పందించలేదని ఆయన విమర్శించారు. “ఇది ప్రభుత్వానికి ప్రజల అవసరాలపై ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు.
కడప ప్రాంతంలోని టిడిపి నేతలు, కార్యకర్తలు పులివెందుల మెడికల్ కాలేజ్ నుండి పరికరాల తరలింపు మరియు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
