ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి అయింది. అయితే ఈ మూడేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ది చేశామని, గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో మూడేళ్లలోనే 31 పథకాలు అమలు చేశామని జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ” గడప గడపకు మన ప్రభుత్వం ” అనే కార్యక్రమాన్ని చేపట్టారు సిఎం జగన్. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళిన నేతలకు వ్యతిరేక స్వరాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు జరగడం లేదని, రోడ్లు బాగోలేవని, పింక్షన్లు రావడం లేదని.. ఇలా ఎన్నో సమస్యలను నేతల ముందు పెట్టి నిలదీశారు ప్రజలు.. దాంతో వారికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో వైసీపీ నేతలు సైలెంట్ అయిన సందర్భాలు “గడప గడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమంలో చాలానే చోటు చేసుకున్నాయి.
అయితే సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నుంచి సానుకూలత వస్తుందని భావించిన జగన్ సర్కార్.. ఇలా ఊహించని పరాభవం ఎదురవుతుండడంతో ప్రజలు వ్యక్తం చేస్తున్న డిమాండ్లపై దృష్టి సాధించే పనిలో పడ్డారు సిఎం జగన్. ఈ క్రమంలోనే గ్రామాల్లో ఇంతవరకు పరిష్కారం అవ్వని సమస్యలను రూపుమాపేందుకు మూడు వేల కోట్లను కేటాయించింది. ఏపీలో ఉన్న మొత్తం సచివాలయాలకు అంటే ఒక్కో సచివాలయానికి 20 లక్షల చొప్పున ఈ నిధులను కేటాయించింది.
దీంతో గ్రామస్థాయిలో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం ప్రశంశనీయమే. ఇక గ్రామాల్లో అభివృద్ది పనులకు నిధుల కొరత ఉందని అసంతృప్తిగా ఉన్న నేతలకు తాజా నిర్ణయం కాస్త ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ప్రజలు వ్యక్తం చేసిన సమస్యలను పరిష్కరించే వీలు ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు అనగా రోడ్లు, కాలువలు, డ్రైనేజిలు వంటి సమస్యలు పరిష్కరించబడతాయో లేదో చూడాలి.
Also Read : మావి ఉచితలు కాదండీ బాబు !