కొందరు సెలబ్రిటీలు తమకు ఎదురవుతున్న కామెంట్స్ ద్వారా బాధపడుతుంటారు. మరి కొంతమంది సెలబ్రిటీలను వేధిస్తుంటారు. ఇప్పుడు సినీ నటి కరాటే కళ్యాణికి కూడా ఇలాంటివే ఎదురవుతున్నాయట. అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు, అశ్లీల వీడియోలు పంపుతూ తనను చిత్రహింసలు పెడుతున్నారని ఆమె వాపోయారు. ఈ మేరకు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఫోన్ చూడాలంటేనే భయంగా ఉందని.. కొన్ని రోజుల నుంచి కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారని.. కొన్ని నంబర్లను బ్లాక్ చేసినా వేరే ఫోన్ నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని ఆమె వివరించారు. కొన్నింటిలో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారంటూ తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను అభ్యర్థించారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొద్దిరోజుల నుంచి పలువురు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్, ఫేస్బుక్లలో కథనాలు, వీడియోలను అప్లోడ్ చేస్తున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు వివరించారు.
ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులతో కలిసి కొన్ని రోజుల క్రితం కరాటే కళ్యాణి ఓ డిబేట్లో పాల్గొన్నారు. హిందువులు పవిత్రంగా భావించే కొన్ని పేర్లను వాడుకుని బూతు చేష్టలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పేర్లు పెట్టకూడదని, కావాలంటే ముస్లిం, క్రైస్తవ పేర్లు పెట్టుకోండి అంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణికి సైబర్ వేధింపులు ఎక్కువ అయ్యాయి.