డైరెక్టర్ అవుదామని వచ్చి ఉయ్యాలా జంపాలాతో హీరో అయ్యాడు రాజ్ తరుణ్. తర్వాత సినిమా చూపిస్త మావాతో మరో హిట్ కొట్టాడు రాజ్ తరుణ్. ఈ రెండు సినిమాల బడ్జెట్ 3 నుంచి 4 కోట్ల లోపే. ఈ రెండూ 10 కోట్లకు పైగా వసూలు చేయడంతో రాజ్ తరుణ్ రేంజ్ మారిపోయింది.
మినిమమ్ గ్యారెంటీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు ఈ కుర్రాడు. ఇక సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ తో రాజ్ తరుణ్ కెరీర్ గ్రాఫే మారిపోయింది. ఈ సినిమా ఏకంగా 18 కోట్లు వసూలు చేసింది. కానీ ఆ తర్వాతే సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, విష్ణుతో చేసిన ఆడోరకం ఈడోరకం సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో రాజ్ తరుణ్ ఒక్కసారిగా స్లో అయిపోయాడు. అంతేకాదు.. దిల్ రాజుతో ఓ సినిమా.. మారుతితో ఓ సినిమా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ తో ఓ సినిమా.. సీనియర్ వంశీతో ఓ సినిమా.. ఇలా నాలుగైదు సినిమాలు రాజ్ తరుణ్ ఖాతాలో ఉండేవి. కానీ ఇప్పుడు అవేవీ కనిపించట్లేదు.
ఎలాంటి అండ లేకుండా వచ్చిన హీరోలు ఇండస్ట్రీలో నిలబడటం అంటే నీటిమీద వెళ్లి నిలబడ్డట్లే. గతంలో ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు అలాగే చేయాలని ప్రయత్నించారు. కానీ ఇండస్ట్రీ అనే మహా సముద్రాన్ని ఈదడం వాళ్ల వల్ల కాలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇదే చేయాలనుకున్నాడు. ఈ కుర్ర హీరో మాత్రం తాను ఈదగలను అంటున్నాడు. కానీ ఇప్పటికే ఈ కుర్రాన్ని తొక్కేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి కూడా. దాని ఫలితమే వరసగా సినిమాలు రాజ్ తరుణ్ నుంచి చేజారిపోవడమే. దానికితోడు ఈ హీరో గారు కూడా డైరెక్షన్ లో వేలు పెడతారనే మంచి పేరు సంపాదించుకున్నారు. మొత్తానికి రాజ్ తరుణ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలిక.