పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘బుజ్జిగాడు’ సినిమాతో సంజనా ప్రేక్షకులకి పరిచయమైంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. సర్ధార్ గబ్బర్ సింగ్ లో కీలక పాత్ర పోషించినప్పటికి అది కూడా కలిసిరాలేదు. దాంతో కన్నడ, బాలీవుడ్ సినిమాలు చేస్తూ వస్తుంది. ఇది పక్కన పెడితే.. ఈమె ఓ నిర్మాత పై దాడి చేసిన సంఘటన పెద్ద సంచలనం సృష్టిస్తుంది.
విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ నిర్మాత అయిన వందనా జైన్ తో హీరోయిన్ సంజనా కొంత కాలంగా గొడవ పడుతూ వస్తోంది. అయితే తాజాగా ఆ గొడవ పెద్దదైంది. రిచ్మండ్టౌన్లోని ఓ స్టార్ హోటల్లో కలిసిన వీరిద్దరో గొడవ పడ్డారట. ఈ నెపథ్యంలో సంజనా మద్యం బాటిల్ను వందనా జైన్ పై విసిరి కొట్టిందట. దీంతో.. కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్లో సంజనా పై కేసు ఫైల్ చేసింది వందనా. దీంతో వీరి మధ్య సంధి చేయడానికి కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నం చేయడంతో కాస్త సదుమణిగినట్లు తెలుస్తోంది.
ఇక ఈ విషయంపై నిర్మాత వందనా స్పందిస్తూ.. ’మా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందనేది నిజం. మేము పాత స్నేహితులమే.. అందుకే గొడవను రాజీ చేసుకున్నాము. కథ చర్చించుకుంటున్న విషయంలో ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడంతో ఈ గొడవ చోటుచేసుకుంది’ అంటూ చెప్పింది. సంజనా మాత్రం వందనాపై ఘాటు కామెంట్స్ చేసింది. “వందన దగ్గర 200 కోట్ల అక్రమ ఆస్తి ఉంది. ఈ విషయంపై ఆమెను అధికారులు ప్రశ్నించాలి. అసలు వందనా వద్ద అంత డబ్బు ఎక్కడిది.. విచారణ జరపండి” అంటూ సంజనా కోరింది.