ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం దేవర. 2024 ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుండి ఎవరూ ఊహించని అప్డేట్ ఇచ్చారు కొరటాల. రెండు పార్టులుగా సినిమా రానుందని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్కు కిక్ ఇచ్చే న్యూస్ ఇచ్చినా కొరటాలను ఇప్పటికి ఆచార్య ఫ్లాప్ వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పటివరకు చేయని పాత్ర ఈ సినిమాలో చేస్తుండటం, అది రెండు పార్టులుగా వస్తుండటంతో ఒకవేళ ఫస్ట్ పార్టు ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే పరిస్థితి ఏంటా అని తలలు పట్టుకుంటున్నారు.
ఇక ఈ రెండు పార్టుల కథ దేవరతో మొదలైంది కాదు ఇదే చివరిది కాదు. గతంలో రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి, కేజీఎఫ్ ఘన విజయం సాధించాయి. ఇక బన్నీతో సుకుమార్ పుష్ప మూవీని రెండు పార్టులుగా తీసుకొస్తున్నారు. ఫస్ట్ పార్టు ఎవరూ ఊహించని సక్సెస్ సాధించడమే కాదు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు ఇదే బాటలో వెళ్తున్నారు కొరటాల.
కథ డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కొరటాల చెప్పారు. అయితే కొంతమంది కొరటాల నిర్ణయాన్ని స్వాగతిస్తున్న మరికొంతమంది మాత్రం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడమేనని ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ కొరటాల చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవడం ఖాయం…కానీ సీన్ రివర్స్ అయిందా అటూ కొరటాలతో పాటు ఎన్టీఆర్కు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకవేళ ఫ్లాప్ అయితే అటు నిర్మాతలతో పాటు ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా కొరటాల మాత్రం దేవరతో పులి మీద స్వారీ చేస్తున్నారనే చెప్పక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.