తెలంగాణలో స్టీరింగ్ వదిలి డ్రైవర్ గుట్కా వేసుకోవడంతో బస్సు బోల్తా పడిన ఘటన మరువక ముందె అలాంటి ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు కల్వర్టును ఢీకొట్టి రోడ్డు అవతలకు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ సమీపంలో శుక్రవారం (మే 17) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు చెన్నూరు నుంచి మంచిర్యాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.