రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం ఈ ఏడాది చివర్లో జరగబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వజ్రాల వ్యాపారి, రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోక మెహతాను ఆయన మనువాడబోతున్నారని తెలిసింది. త్వరలోనే నిశ్చితార్థం తేదీని ప్రకటించి, డిసెంబరు ప్రారంభంలో పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తారని సమాచారం.
అయితే, ఈ పెళ్లి విషయంపై వ్యాఖ్యానించేందుకు రెండు కుటుంబాలు నిరాకరిస్తున్నాయి. నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించి ఇంకా తేదీలేవీ ఖరారు కాలేదని ముకేశ్ అంబానీ కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు తెలిపారు. ఆకాశ్ అంబానీ పెళ్లికి సంబంధించిన శుభవార్తను తగిన సమయంలో ముకేశ్ కుటుంబమే స్వయంగా అందరితో పంచుకుంటుంది. పెళ్లి ఖరారైతే కచ్చితంగా అది భారత్లోనే జరుగుతుంది’ అని ఆయా వర్గాలు వివరించారు.
రోజీ బ్లూ డైమండ్స్’ అధినేత రసెల్ మెహతా కుటుంబంతో ముకేశ్ అంబానీ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీ ఇద్దరూ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో వీరిద్దరూ కలిసి చదువుకోవడం విశేషం. 2009లో హైస్కూలు విద్యను పూర్తి చేసుకున్న శ్లోకా మెహతా… ఆ తర్వాత ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆంత్రొపాలజీ డిగ్రీ చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. రోజీ బ్లూ ఫౌండేషన్లో 2014 జూలై నుంచి డైరెక్టర్గా కొనసాగుతున్నారు.