తెలుగురాష్ట్రాల్లో మరో పరువు హత్య కలకలం రేపింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిందని కన్న కూతురిని హత్య చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పరిధిలో చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని హెచ్చెల్సీ కాలువలో ఆదివారం ఓ బాలిక మృతదేహం దొరికింది. ఈ మృతదేహం చెన్నంపల్లికి చెందిన 16 ఏళ్ల హేమశ్రీ గా పోలీసులు గుర్తించారు.చెన్నంపల్లికి చెందిన 16 ఏళ్ల హేమశ్రీ… వేరే కులానికి చెందిన మోహన్ రాజ్..అనే యువకుడ్ని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ తిరుమలకు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు.
వేరే సామాజిక వర్గానికి చెందిన మోహన్ రాజుతో వివాహం చేసుకోవడం ఇష్టం లేని హేమశ్రీ తల్లిదండ్రులు తమ కూతురు గ్రామానికి వచ్చిన విషయాన్ని తెలుసుకొన్నారు. ఆదివారం నాడు ఆగ్రహంతో బాలికను వీధుల్లో కొట్టుకొంటూ ఇంటికి తీసుకెళ్లారు. ఆరోజు రాత్రి నుండి ఆ బాలిక, తల్లిదండ్రులు అదృశ్యమయ్యారు.
ఇదే సమయంలో ఆదివారం మండలపరిధిలోని హెచ్చెల్సీ కాలువలో బాలిక మృతదేహం కనిపించింది. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది.బాలిక మృతదేహం హేమశ్రీగా గుర్తించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులు, బాబాయిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.