మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు కృష్ణమీనన్ మార్గ్లోని వాజ్పేయి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే తాను సీఎంగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు.
1998లో తాను హైటెక్ సిటీ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తే ఆయన వచ్చారని, వాంబే (వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన) పథకానికి ఏపీ నుంచే అంకురార్పణ జరిగిందని చెప్పారు. తాను అడగ్గానే ఎంఎంటీఎస్, శంషాబాద్ ఎయిర్ పోర్టులను మంజూరు చేశారని అన్నారు.
స్పీకర్ పదవికి ఓ మంచి ఎంపీని సూచించాలని కోరితే, తాను బాలయోగిని సూచించానని, మరో మాట మాట్లాడకుండా, ఆయన అభ్యర్థిత్వాన్ని ఓకే చేశారని చెప్పారు. అటువంటి మహానేతను కోల్పోవడం దేశానికి తీరనిలోటని చంద్రబాబు అన్నారు.
అధికార, ప్రతిపక్షాల్లో వాజ్పేయికి సాటి మరెవ్వరూలేరని అన్నారు. విలువలకు కట్టుబడి నమ్ముకున్న సిద్ధాంతాలను, ఆదర్శాలను నిజ జీవితంలో ఆచరించి చూపిన గొప్ప మానవతావాది.. ఎంపీ, ప్రధాన ప్రతిపక్షనేత, విదేశాంగమంత్రి, ప్రధానమంత్రిగా బహుముఖ పాత్ర పోషించిన ఉదారవాదని కొనియాడారు.
నదుల అనుసంధానం, స్వర్ణ చతుర్భుజి నిర్మాణం ఆయన ఆలోచనలే.. మంచి నిర్ణయంపై సానుకూలంగా ఆలోచించడం ఆయన నైజమని, ఇలాంటి గొప్ప గుణం ఇతరుల్లో కనిపించదని అన్నారు. జాతీయ రహదారి అభివృద్ధి, వెలుగు ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు నిధులు, ఐటీ రంగం అభివృద్ధి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణంలో వాజ్పేయీ సహకారం మరువలేనిదని అన్నారు.