కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇదే సమయంలో నటుడు శివాజీ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో శివాజీని చూడగానే బీజేపీ కార్యకర్తల కోపం కట్టలు తెంచుకుంది.
ఆయనను చూసిన బీజేపీ శ్రేణులు దుర్భాషలాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే విమర్శలు చేస్తావా? అంటూ శివాజీని అడ్డుకుని, ఆయనను ముందుకు కదలనివ్వలేదు. తీవ్ర వాగ్వివాదం చెలరేగుతుండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శివాజీని పోలీసులు కారు ఎక్కించి పంపారు.
బెదిరింపులకు భయపడేది లేదని శివాజీ స్పష్టం చేశారు. గత కొంత కాలంగా ఏపీ ప్రత్యేక హోదాపై గళం వినిపిస్తున్న శివాజీ.. మోదీ ప్రభుత్వం, బీజేపీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు